Justin Trudeau | న్యూఢిల్లీ: భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతినేలా తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. ఆదివారం టొరంటోలో ‘ఖల్సా డే’ వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రధాని ట్రూడోతోపాటు విపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ట్రూడో సమక్షంలో ఖలిస్థాన్ నినాదాల ఘటనపై న్యూఢిల్లీలోని కెనడా హైకమిషనర్కు భారత్ సమన్లు జారీచేసింది. ఈ పరిణామం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, హింసను ప్రోత్సహించేలా ఉందని నిరసన వ్యక్తం చేసింది.
పన్నూ హత్యాయత్నం కేసు..
‘రా’ అధికారి పేరు బయటకు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై దాఖలైన అభియోగపత్రంలో ‘సీసీ-1’గా పేర్కొన్న వ్యక్తి ‘రా అధికారి విక్రమ్ యాదవ్’ అంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ కేసులో ఆరోపణల్ని భారత్ మొదట్నుంచీ ఖండిస్తున్నది.