తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో మహీంద్ర సంస్థకు చెందిన ఎరుపు రంగు థార్ వాహనం వేలం వివాదస్పమైంది. దీంతో తాజాగా మరోసారి వేలం వేయగా ఒక ఎన్నారై రూ.43 లక్షలకు కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఈ వాహనాన్ని తొలిసారి వేలం వేశారు. బహ్రెయిన్కు చెందిన ఎన్నారై అమల్ మహమ్మద్ అలీ ఒక్కరే వేలం పాటలో పాల్గొన్నారు. రూ.15.10 లక్షలకు బిడ్ చేసి దానిని దక్కించుకునేందుకు ప్రయత్నించారు.
అయితే గురువాయూర్ దేవస్థానంలోని ఒక వ్యక్తి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం కేరళ హైకోర్టుకు చేరింది. ప్రజా విచారణ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ మేరకు ప్రజా విచారణ నిర్వహించగా ఆ వాహనాన్ని తిరిగి వేలం వేయాలని నిర్ణయించారు. దీంతో ఇటీవల థార్ వాహనానికి వేలం పాట నిర్వహించారు. బెస్ట్ ప్రైస్ రూ.15 లక్షలుగా పేర్కొన్నారు.
కాగా, ఈసారి వాహనం వేలం పాటలో 15 మంది పాల్గొన్నారు. దుబాయ్లో వ్యాపారం చేస్తున్న మలప్పురం భక్తుడు విఘ్నేష్ విజయకుమార్ దీనిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఎంత ధరకైనా సరే ఆ వాహనాన్ని సొంతం చేసుకోవాలని తన ఏజెంట్కు తెలిపారు. దీంతో రూ.43 లక్షలకు ఆయన బిడ్ గెలుచుకున్నారు. గతం కంటే సుమారు మూడు రెట్లకు ఇది అమ్ముడుపోయింది. వేలం పాటలో థార్ వాహనాన్ని దక్కించుకోవడంపై విఘ్నేష్ తండ్రి హర్షం వ్యక్తం చేశారు.