Domestic Violence | కేరళలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భార్య తనపై గృహహింస కేసు పెట్టడంతో.. విచారణ కోసం వచ్చిన మహిళా అధికారిపైకి కుక్కను ఉసిగొల్పాడో వ్యక్తి. కుక్క దాడిలో అధికారి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వయనాడ్ జిల్లా మేపద్దిలో బుధవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. దాంతో మహిళా భద్రతా అధికారి విచారణ కోసం ఆమె ఇంటికి చేరుకున్నారు.
ఆ సమయంలో సదరు వ్యక్తి మహిళా అధికారిపై కుక్కను వదలడంతో.. ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ ఘటనను కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ఖండించారు. కూర్రమైన చర్యగా అభివర్ణించారు. మహిళా అధికారి దాడిలో తీవ్ర గాయాలకు గురయ్యారని, ఈ విషయంపై ఆమెతో మాట్లాడినట్లు చెప్పారు. గృహహింస విషయంలో ఓ మహిళ న్యాయ సహాయ చేయాలని మహిళా అధికారి మాయా పనికర్ కోరింది.
ఆ తర్వాత బాధితురాలుకు పలుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బాధిత మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సమయంలో మహిళా అధికారి వెంట కుటుంబ సలహాదారు సైతం ఉన్నారు. ఆ తర్వాత బాధితురాలి భర్త ఇద్దరిపై కుక్కలు వదిలాడని పోలీసులు తెలిపారు. కుక్క ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసిందని వివరించారు. అయితే, చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న అధికారులపై కుక్కతో దాడి చేయించడం విచారకరమని మంత్రి వీణాజార్జ్ అన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.