తిరువనంతపురం: ఇద్దరు విద్యార్థినులు ప్రయాణించిన స్కూటీ ప్రైవేట్ బస్సు, లారీ మధ్య ఇరుక్కుంది. అయితే వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video) . కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఇద్దరు యువతులు మావూరు నగరంలోని ఇరుకైన రోడ్డులో స్కూటీపై వెళ్తున్నారు. అయితే స్కూటీ డ్రైవ్ చేస్తున్న యువతి, ముందు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఒక లారీ ఎదురుగా వచ్చింది. దీంతో బస్సు, లారీ మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది. అయితే అదృష్టవశాత్తూ స్కూటీపై ఉన్న ఇద్దరు యువతులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
కాగా, ఈ సంఘటనతో స్కూటీతో సహా ఇద్దరు యువతులు రోడ్డుపై పడ్డారు. వారు ధరించిన హెల్మెట్లు కూడా రోడ్డుపై దొర్లాయి. అనంతరం బస్సు డ్రైవర్పై వారు అరిచారు. బస్సులోని ప్రయాణికులు కూడా కిటికీ నుంచి ఈ సంఘటనను చూశారు. మరోవైపు ఆ ప్రైవేట్ బస్సుకు ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ సంఘటన రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.