తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 38,684 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 62,11,116కు చేరింది. అయితే గురువారం నాటి కేసులతో పోల్చితే ఇవాళ్టి కేసులు కొంచెం తక్కువే. గురువారం 42,677 మందికి కరోనా సోకింది.
ఇదిలావుంటే, కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 595 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 57,296కు పెరిగింది. ఇక కొత్తగా 41,037 మంది కరోనా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 57,86,949కి చేరింది. రాజధాని తిరువనంతపురం సహా మొత్తం 14 జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉన్నది.