Kerala Nurse : యెమెన్ (Yemen) లో హత్య కేసులో దోషిగా తేలి, ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియ (Nimisha Priya) ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. హతుడి కుటుంబాన్ని ఒప్పించి నిమిషాను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో తన భార్య క్షేమంగా స్వదేశానికి తిరిగొస్తుందని నిమిషా భర్త టామీ థామస్ (Tomy Thomas) ఆశాభావం వ్యక్తం చేశారు.
హతుడు తలాల్ అబ్దో మహదీ (Talal Abdo Mahdi) కుటుంబాన్ని తాము పరిహారానికి ఒప్పించగలమని తాను, తన కూతురు ఆశతో ఉన్నామని థామస్ చెప్పారు. తన కూతురు గతంలో తల్లితో గడిపిన రోజులను గుర్తుచేసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నదని తెలిపారు. ఆమె తల్లి లాలనను, ప్రేమను మిస్సవుతున్నదని అన్నారు. నర్సు నిమిషా ప్రియ.. 2008లో కూలీలుగా జీవనం గడుపుతున్న తన తల్లిదండ్రులను ఉన్నత స్థితిలో చూడాలనే కోరికతో యెమెన్కు వెళ్లింది.
అక్కడ పలు ఆస్పత్రుల్లో పనిచేసింది. ఆ తర్వాత యెమెన్కు చెందిన తలాల్ అబ్దో మహదీతో కలిసి సొంతంగా క్లినిక్ను ఏర్పాటు చేసింది. తర్వాత అబ్దోతో గొడవలు జరగడంతో స్వదేశానికి తిరిగిరావాలని భావించింది. కానీ నిమిషా ప్రియ పాస్పోర్టును తిరిగిచ్చేందుకు అబ్దో నిరాకరించాడు. దాంతో అతడికి మత్తు మందు ఇచ్చి పాస్పోర్టు తిరిగి తీసుకోవాలని భావించింది. అనుకున్నట్టే ప్లాన్ అమలుచేసింది. అయితే దురదృష్టవశాత్తు మత్తు డోస్ ఎక్కువై అబ్దో మరణించాడు.
దాంతో ఆమెపై హత్య కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు ఆమె హత్య చేసినట్లు నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. చివరికి యెమెన్ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరగా.. అతడు కూడా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాడు. దాంతో నిమిషా ప్రియకు ఉరి ఖరారైంది. ఇక హతుడు అబ్దో కుటుంబం పరిహారానికి అంగీకరించి క్షమిస్తే తప్ప ఆమెకు ఉరి తప్పేలా లేదు.