న్యూఢిల్లీ, జూలై 24: సమాజంలో వేధింపులకు గురవుతున్న అవివాహిత మహిళల సంతానానికి ఉపశమనం కల్పిస్తూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును పేర్కొనకుండా కేవలం తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేసింది. సమాజంలో అవివాహిత మహిళలు, అత్యాచార బాధితుల పిల్లలకు ఎదురవుతున్న బాధలను గుర్తిస్తూ ఈ తీర్పును వెలువరించింది.
మహాభారతంలోని కర్ణుడి ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తల్లిదండ్రులెవరో తెలియనందుకు జీవితాంతం దూషణలకు గురైన కర్ణుడి లాంటివారు మన సమాజంలో ఎవరూ ఉండకూడదని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి తండ్రి పేరును తొలగించాలని కోరుతూ దాఖలైన ఓ రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తల్లిపేరును మాత్రమే పేర్కొంటూ గుర్తింపు పత్రాన్ని జారీచేయాలని అధికారులను ఆదేశించారు.
అవివాహిత మహిళలకు పుట్టినవారు కేవలం ఆమె పిల్లలే కాకుండా ఈ మహోన్నత భారత దేశం బిడ్డలని, వారు కూడా ఈ దేశ పౌరులేనని అన్నారు. వారికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని, వారి గోప్యత, గౌరవం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను హరించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు.