Sabari temple Gold : కేరళ (Kerala) లోని శబరిమల (Sabarimala) అయ్యప్పస్వామి ఆలయం (Ayyappa Temple) లో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాలు బరువు తగ్గాయి. ప్రస్తుతం కేరళ హైకోర్టు (Kerala High Court) లో వీటిపై విచారణ జరుగుతున్నది. బంగారు తాపడాల విషయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇదిలావుంటే ‘బంగారు తాపడాల బరువు ఎందుకు తగ్గింది.. అసలు వాటికి ఏమైంది..?’ అని జాతీయ మీడియాలో చర్చ జరుగుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలు. వాటిని సరి చేయించేందుకు ఉన్నికృష్ణన్ అనే స్పాన్సర్ ముందుకొచ్చారు.
అయితే వాటిని తిరిగి ద్వారపాలక విగ్రహాలకు అమర్చే సమయానికి బరువు కేవలం 38.25 కిలోలకు తగ్గిపోయింది. ఇది వివాదానికి దారితీసింది. ఇదిలావుంటే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. తాపడాలను పునరుద్ధరించేందుకు చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థకు తరలించాలి. కానీ షెడ్యూల్కు భిన్నంగా దాదాపు 39 రోజులు ఆలస్యంగా ఆగస్టు 29న అవి చెన్నైకి చేరుకున్నాయి.
ఈ 39 రోజుల కాలంలో తాపడాలను పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొట్టాయంలోని ఓ దేవాలయంతోపాటు ఏపీలోని కొన్ని దేవాలయాలకు, బెంగళూరులోని అయ్యస్వామి గుడికి ఆ తాపడాలను తరలించారని సమాచారం. మళయాళ నటుడు జయరామ్ ఇంట్లో జరిగిన ఓ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కూడా తాపడాలను పెట్టారని తెలుస్తోంది.
చివరగా మరమ్మతులు పూర్తైన అనంతరం అవి సెప్టెంబర్ 11న శబరిమలకు చేరుకున్నాయి. అప్పటికే వాటి బరువు అనుమానాస్పద రీతిలో తగ్గిపోయింది. యాక్టర్ జయరామ్ ఇంట్లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో తాపడాలను పెట్టినట్టు స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ కూడా ఫేస్ బుక్ పోస్టులో వెల్లడించింది. తమ వద్దకు వచ్చిన తాపడాల బరువు 38.28 కేజీలేనని తెలిపింది.
ఈ నేపథ్యంలో అసలు శబరిమలను వీడిన తాపడాలే స్మార్ట్ క్రియేషన్స్కు చేరుకున్నాయా.. లేదా మారిపోయాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాపడాలను భద్రపరిచే బాధ్యత ఎవరు తీసుకున్నారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కేరళ రాజకీయ పక్షాలు, లిటిగెంట్లు కూడా ఈ అంశాలనే లేవనెత్తుతున్నారు.
1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్య.. శబరిమల గుర్భగుడి కోసం 30 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది మరో 800 గ్రాముల బంగారం తలుపుల తాపడాల కోసం విరాళంగా దేవస్థానానికి అందింది. ఈ నేపథ్యంలో నాడు అందిన బంగారానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ను సేకరించి సీల్డ్ కవర్లో సమర్పించాలని కేరళ హైకోర్టు డివిజన్ బెంజ్ ఆదేశించింది.
ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, ఈ అంశం రాజకీయంగా కూడా వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.