తిరువనంతపురం: కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఇటీవల ఓ హెచ్చరిక చేశారు. కాస్మిటిక్ ఉత్పత్తుల్లో(Cosmetic Products) అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్నట్లు ఆమె తెలిపారు. మెర్క్యూరీ స్థాయి ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల్ని కేరళలో అమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాస్మటిక్ ఉత్పత్తులను లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె తన ఫేస్బుక్ పోస్టులో తెలిపారు. ప్రోడక్ట్ను కొనేముందు ఉత్పత్తిదారుడి అడ్రస్ను తెలుసుకోవాలన్నారు.
కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సౌందర్యను మొదలుపెట్టారు. కాస్మటిక్ ఉత్పత్తుల్లో ప్రమాకర కెమికల్స్ కోసం అన్వేషిస్తున్నారు. ఫేక్ ఉత్పత్తుల్ని సీజ్ చేస్తున్నారు. 2023లో తొలిసారి ఈ ఆపరేషన్ మొదలైంది. రెండు దశల్లో దీన్ని చేపట్టారు. ఆ టైంలో ఏడు లక్షల ఖరీదైన నకిలీ కాస్మటిక్ ఉత్పత్తుల్ని సీజ్ చేశారు. 33 మంది ఉత్పత్తిదారులపై వివిధ కేసుల్ని నమోదు చేశారు.
లిప్స్టిక్, ఫేస్ క్రీముల్లో మోతాదుకు మించి మెర్క్యూరీ లెవల్స్ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో గుర్తించారు. కొన్ని శ్యాంపిళ్లలో మెర్క్కూరీ లెవ్స్ సుమారు 12000 రెట్లు అధికంగా ఉన్నట్లు పసికట్టారు. ఇలాంటి ప్రమాకర రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే ఛాన్సు ఉన్నది. కొన్ని సందర్భాల్లో అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ జారీ చేశారు.
మెర్క్యూరీ అధిక మోతాదులో ఉన్న ఉత్పత్తుల్ని వాడడం వల్ల.. చర్మం రంగు మారుతుంది, చర్మంపై ఎరుపు గుళ్లలు అవుతాయి, ఉదర, నాడీ, ఇమ్యూన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్సు ఉంది. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ కూడా వస్తుందని యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఉత్పత్తులపై మెర్క్యూరియస్ క్లోరైడ్, మెర్క్యూరీ, మెర్క్యూరిక్, మెర్క్యూరియో, కలోమెల్ అని రాసి ఉంటుంది. ఇలా రాసిలేని పక్షంలో ఆ ఉత్పత్తులతో సమస్య ఏర్పడే అవకాశం ఉన్నది. ఇంగ్లీష్ భాషలో లేదా స్థానిక భాషలో ఉత్పత్తిపై రాసి లేకుంటే దాన్ని కొనవద్దు. మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల వణుకు, డిప్రెషన్, వినికిడి లోపం, దృష్టి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.