కొచ్చి: స్వంత సోదరుని వల్ల ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అయితే ఆ మైనర్ గర్భాన్ని(Pregnancy) తొలగించేందుకు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అబార్షన్ను అనుమతించకపోతే అప్పుడు ఆ అమ్మాయికి సామాజిక, వైద్యపరమైన సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కోర్టు తెలిపింది. ఈ కేసులో జస్టిస్ జియాద్ రెహ్మాన్ తీర్పును ఇచ్చారు. మెడికల్ బోర్డు రిపోర్టు ప్రకారం 32 వారాల దాటిన గర్భాన్ని కొనసాగించినా.. దాని వల్ల ఆ అమ్మాయికి సామాజిక, మానసికమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు కోర్టు తెలిపింది. ఆ బాధితురాలి వయసు 15 ఏళ్లు.
ఒకవేళ అబార్షన్ చేయించకుండా కొనసాగిస్తే, ఆ అమ్మాయి బిడ్డకు జన్మనిస్తుందని, అప్పుడు సమస్య మరింత జఠిలం అవుతుందని కోర్టు చెప్పింది. అందుకే పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థి కూతురి గర్భాన్ని తొలగించాలని ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మాలపురం ప్రభుత్వం ఆస్పత్రి, డాక్టర్లకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, మళ్లీ వారం తర్వాత ఈ కేసులో వాదనలు విననున్నట్లు ఆ జడ్జి తెలిపారు.