తిరువనంతపురం: దేశంలో ఇప్పుడు ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్ల హవా నడుస్తున్నది. కరోనా మహమ్మారి విజృంభణతో ఓటీటీలదే రాజ్యంగా మారిపోయింది. లాక్డౌన్లతో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలు.. వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి. రెండేండ్లలో ఓటీటీ ప్లాట్ఫామ్లు చూసేవారు భారీగా పెరిగిపోయారు. టాకీసులు మళ్లీ తెరచుకున్నప్పటికీ అటువైపు వెళ్లేవారిసంఖ్య ఘననీయంగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వాలు కూడా ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్ఫామ్లోకి ప్రవేశిస్తున్నాయి. సీస్పేస్ పేరుతో ఓటీటీ సంస్థను ఏర్పాటుచేందుకు కేరళ ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తున్నది.
రాష్ట్రావతరణ దినోత్సవమైన నవంబర్ 1న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్ వెల్లడించారు. కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (KSFDC) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్న ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, ఇతర వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తామని తెలిపారు. జూన్ 1 నుంచి సినిమాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆరంభిస్తామన్నారు.
ఓటీటీ మీడియా సర్వీస్ ఇంటర్నెట్పై ఆధారపడి పనిచేస్తుంది. దీనినే డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ కార్యక్రమాలు, సెలబ్రిటీ షోలు ప్రసారం చేస్తారు. ఓటీటీలో వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ కార్యక్రమం కావాలంటే అది చూడొచ్చు. కేబుల్ టీవీ, డీటీహెచ్ కనెక్షన్ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించుకుని సెల్ఫోన్, ల్యాప్టాప్, టాబ్, టీవీల్లోనూ ఈ కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది.