తిరువనంతపురం: కేరళలో ఒక్క రోజులోనే కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. ఆదివారం 66 కరోనా మరణాలు నమోదు కాగా, సోమవారం ఈ సంఖ్య 135కు చేరింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 11,586 కరోనా కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,83,116కు, మొత్తం మరణాల సంఖ్య 16,170కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 14,912 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,29,638కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,36,814 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.