తిరువనంతపురం: క్రైస్తవ సన్యాసిని రేప్ చేసిన కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషిగా తేలారు. 2014 నుంచి 2016 మధ్య కాలంలో ఓ నన్ను అత్యాచారం చేసినట్ల ఫ్రాంకోపై ఆరోపణలు ఉన్నాయి. సంచలనం రేపిన ఆ కేసులో ఇవాళ కేరళ కోర్టు తీర్పును వెలువరించింది. దాదాపు 100 రోజుల పాటు జరిగిన విచారణ తర్వాత ఫ్రాంకోను నిర్దోషిగా తేలినట్లు కొట్టాయం కోర్టు తెలిపింది. రేప్ కేసులో ఆధారాలు సరిగా లేవని కోర్టు చెప్పింది. జడ్జి జీ గోపకుమార్ ఈ కేసులో తీర్పును ఇచ్చారు. సింగిల్ లైన్ తీర్పునిస్తూ.. ఫ్రాంకోపై మోపిన అభియోగాలన్నింటి నుంచి రిలీఫ్ కల్పిస్తున్నట్లు కోర్టు తెలిపింది. జలంధర్ డయోసిలో ఫ్రాంకో మాజీ బిషప్గా చేశారు. ఇండియాలో ఓ బిషప్పై రేప్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ కేసులో 39 మంది సాక్ష్యం ఇవ్వగా.. ఒక్కరు కూడా సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు.
నన్ రేప్ కేసులో 57 ఏళ్ల బిషప్ ఫ్రాంకోపై జూన్ 2018లో కొట్టాయం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్లలో పలుమార్లు బిషప్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. 2018 సెప్టెంబర్లో బిషప్ను అరెస్టు చేసింది. అక్రమ నిర్బంధం, రేప్, అసహజ శృంగారం, నేర ప్రవృత్తి కింద బిషప్పై కేసులు నమోదు అయ్యాయి. 2019 నవంబర్లో ఈ కేసులో కోర్టు విచారణ మొదలైంది. ఈ ఏడాది జనవరి 10వ తేదీన విచారణ ముగిసింది. ఈ కేసులో కోర్టు అనుమతితోనే మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు.