చండీఘఢ్ : పంజాబ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే జలంధర్లో అతిపెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. పంజాబ్ ప్రజలకు సంతోషకరమైన పాలన అందించేందుకు 2022 మార్చ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జలంధర్లో బుధవారం జరిగిన రోడ్షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ పంజాబ్ ప్రజలు మార్పునకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉగ్రవాద ఉన్మాదాన్ని చవిచూసిన పంజాబ్ మరోసారి ఆ అరాచకం తిరిగి రావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. పంజాబ్ శాంతి సామరస్యాల ప్రస్ధానమే తిరంగా యాత్ర ఉద్దేశమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆప్ అందుకు అనుగుణంగా వ్యూహాలకు పదునుపెడుతోంది.
పంజాబీలను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ పలు వర్గాలపై ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. విద్యార్ధులకు ఉచిత విద్య, ఐఏఎస్, వైద్య, ఐఐటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, ఉచిత విదేశీ విద్య వంటి హామీలతో యువతకు చేరువకావాలని ఆప్ ప్రయత్నిస్తోంది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే 18 ఏండ్ల పైబడిన మహిళలకు నెలకు రూ 1000 అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.