Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి రౌస్ అవెన్యూ కోర్టు మరో షాక్ తగిలింది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం సీఎం వారానికి రెండుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అవకాశం ఉన్నది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఊరటనిచ్చేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంటూ కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించారు.
కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఈడీ వ్యతిరేకించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ-2021 సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇవ్వగా.. తనను అరెస్టును రిమాండ్ను కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేసిన మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. మార్చి 28న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని ఏప్రిల్ ఒకటి వరకు.. ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.