శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త ప్రచార కార్యక్రమాన్ని తనదైన శైలిలో విమర్శించారు. దేశ వ్యాప్తంగా ‘ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం’ పేరుతో చేపట్టనున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై స్పందించాలని మీడియా ఆయనను అడిగింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన ‘వాటిని మీ ఇళ్లలోనే ఉంచుకోండి’ అంటూ స్థానిక భాషలో కౌంటర్ ఇచ్చారు. కాగా, ప్రతిపక్షాలు బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 9న జమ్ముకశ్మీర్కు వస్తారని, అప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, 2024 లోక్సభ ఎన్నికలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను చేరుకునేందుకు పలు కొత్త కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారాన్ని శనివారం ప్రారంభించనున్నది. ఏడాది పాటు కొనసాగిన 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ ‘అమృత్ మహోత్సవ్’ వేడుకల ముగింపు నేపథ్యంలో ఆగస్ట్ 11 నుంచి 17 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునివ్వనున్నది.