న్యూఢిల్లీ, అక్టోబర్ 19: రోజూ హెలికాప్టర్ నడపటమే ఆయన పని.. కానీ, ఆ రోజు ఎందుకో తన భార్యతో మాట్లాడాలనిపించింది.. కూతురికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసరికి ఆయనకు కూడా అదోలా అనిపించింది. ‘కూతురిని బాగా చూసుకో’ అని భార్యతో అన్నారు. కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన పైలట్ తన భార్యతో అన్న చివరి మాటలివే. ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కర్నల్ అయిన పైలట్ అనిల్ సింగ్(57)కు భార్య, కూతురు ఉన్నారు. ప్రమాద ఘటనకు ముందు రోజు ఆయన తన భార్యతో ఫోన్లో.. కుటుంబ విషయాలు మాట్లాడుకొని, చివరగా కూతురిని బాగా చూసుకో అని ఫోన్ పెట్టేశారు. ఆ మరుసటి రోజే ఘోరం జరిగిపోయింది. మంగళవారం ఉదయం కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్త్కాశీకి ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ప్రయాణికులతో పాటు పైలట్ అనిల్సింగ్ కూడా మరణించారు. అనిల్ సింగ్ చివరి మాటలను గుర్తు చేసుకుంటూ ఆయన భార్య, కుమార్తె కన్నీరుమున్నీరు అవుతున్నారు.