న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు ఆదివారం జరిగాయి. అయితే ఎంసీడీ పరిధిలోని ఒక గ్రామ ప్రజలు ఈ ఎన్నికలను బహిష్కరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నార్త్ వెస్ట్ జిల్లాలోని కటేవారా గ్రామ ప్రజలు ఎంసీడీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఓటు వేయలేదు.
తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు లేవని ఆ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలోని మూడు రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. వీటి కోసం ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకే ఎంసీడీ ఎన్నికలను బహిష్కరించినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఓటింగ్కు దూరంగా ఉన్న గ్రామ ప్రజలు తమ రోజువారీ పనుల్లో బిజీ అయ్యారు. దీంతో కటేవారా గ్రామంలో ఎంసీడీ ఎన్నికల సందడి కనిపించలేదు.
కాగా, మూడు స్థానిక సంస్థల విలీనంతో ఏర్పాటైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కు తొలి ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నది. అయితే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంసీడీలో కూడా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.