(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథపై వచ్చిన సినిమాతో లబ్ధి పొందిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వాస్తవానికి వారి సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధిని కనబరచడం లేదు. 90వ దశకంలో కశ్మీరీ పండిట్ల ఊచకోత తర్వాత బతుకు జీవుడా అంటూ వలస వెళ్లిన పండిట్లను తిరిగి కశ్మీర్కు రప్పించడానికి కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలి పోతున్నాయి. పీఎం ప్యాకేజీలో భాగంగా కశ్మీరీ పండిట్ ఉద్యోగులు తిరిగి స్వస్థలాలకు వచ్చినా, ఇటీవల ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకొని హత్యలు చేయడంతో వారు ఆందోళన పట్టారు. తమ ప్రాణాలకు రక్షణ లేదని, సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని వారు చేస్తున్న ఆందోళన 250 రోజులు దాటింది. అయితే 2500 మంది కశ్మీరీ పండిట్ ఉద్యోగుల్లో కేవలం 177 మందిని బదిలీ చేయటం, బదిలీ అయిన వారంతా బీజేపీ నేతల బంధువులుగా ఆరోపణలు రావడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.
అగ్నికి ఆజ్యం పోసిన బయోమెట్రిక్ విధానం
తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలంటూ కశ్మీరీ పండిట్ ఉద్యోగులు చేస్తున్న నిరసనోద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న కేంద్రం పండిట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కశ్మీర్ పండిట్ ఉద్యోగులందరూ సామూహికంగా బీజేపీ ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది. 2,500 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా ప్రధానికి ఉత్తరాలు రాసి తమ గోసను విన్నవించుకున్నా, ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కార్యాలయాలకు హాజరు కాని కశ్మీరీ పండిట్లకు జీతాలివ్వబోమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించడంతో సమస్య మరింత జటిలమైంది. దీంతో ఉద్యోగులందరూ ఈ నెల 6న జమ్ములోని బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు.
సురక్షితంగా ఉన్నామన్నది భ్రమే!
తామంతా సురక్షితంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం కేవలం భ్రమేనని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలలుగా తమకు జీతాలు లేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు గోరు చుట్టుపై రోకటి పోటులా తమని సతమతం చేస్తున్నాయన్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్లే తిరిగి కశ్మీర్ లోయకు వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. ఇంటినుంచి బయటికి వెళ్తే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. కార్యాలయాలకు కూడా వారానికి రెండుసార్లే వెళ్తున్నామని చెప్పారు.