శ్రీనగర్: ఉగ్రవాదులు ఇటీవల జమ్ముకశ్మీర్లో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక కశ్మీర్ పండిట్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. షోపియాన్ జిల్లాలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఛోటోగామ్ ప్రాంతంలో ఒక షాపు నిర్వహించే సోను కుమార్ బల్జీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీనగర్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఆ కశ్మీరీ పండిట్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, గత 24 గంటల్లో ఏడుగురిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు నలుగురు స్థానికేతరులు ఉన్నారు. పుల్వామా జిల్లాలో కోళ్ల ఫారంలో పని చేసే పంజాబ్కు చెందిన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు ఆదివారం కాల్పులు జరిపారు. సోమవారం శ్రీనగర్లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒక జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో జవాన్ చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్ను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఖండించారు. జవాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు.