జమ్ము, మే 25: జమ్ముకశ్మీర్లో పండిట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఎం ప్యాకేజీలో భాగంగా కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న తమ వర్గానికి చెందిన ఉద్యోగులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ జమ్ములో బుధవారం పండిట్లు ఆందోళనకు దిగారు. కశ్మీరీ పండిట్స్ యునైటెడ్ ఫ్రంట్(కేపీయూఎఫ్) నేతృత్వంలో మహారాజా హరిసింగ్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ పండిట్ ఉద్యోగులను బందీల్లా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల లక్షిత హత్యలను పీయూఎఫ్ కన్వీనర్ సతీశ్ కిస్సు తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులు అనుకూలంగా లేవని, తాజాగా మంగళవారం శ్రీనగర్లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పోలీసు అధికారి మరణించడంతో పాటు, అతని కుమార్తెకు గాయాల పాలైన ఘటనే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు.
రాహుల్ భట్ హత్య ప్రభుత్వ వైఫల్యమే
రాహుల్ భట్ హత్య పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, భద్రతా లోపాలకు అతను బలవ్వాల్సి వచ్చిందని కేపీయూఎఫ్ అధికార ప్రతినిధి కుల్దీప్ విమర్శించారు. హంతకులు భట్ కార్యాలయంలో వచ్చి, హత్య చేసి అక్కడి నుంచి స్వేచ్ఛగా వెళ్లిపోయారంటే భద్రతా పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఎత్తిచూపారు. ప్రభుత్వాలు కశ్మీర్ పండిట్లను బలిపశువులుగా ఉపయోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్లపై దాడులను సహించేది లేదని పేర్కొన్నారు. పండిట్ ఉద్యోగులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.