శ్రీనగర్, మార్చి 22: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మంగళవారం స్పందించారు. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన చిత్రమేనని, నిర్దిష్టంగా ఒక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఆరోపించారు. ‘1990లో చోటుచేసుకున్న ఘటనలు, కశ్మీరీ పండిట్ల వలసలకు నేను బాధ్యుడినని రుజువైతే దేశంలో ఎక్కడైనా ఉరితీయండి.. ఇందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఉద్వేగంగా అన్నారు.
హిందువులు, ముస్లిములు అనే తేడా లేకుండా నాటి ఘటన ప్రతిఒక్కరిలో విషాదాన్ని నింపిందని, అయితే దీనిపై కొన్ని పార్టీలు తమకు అనుకూల ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లు వలస వెళ్లే సమయంలో అప్పటి గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రానే వారిని బస్సులో ఎక్కించి పంపించారని అబ్దుల్లా గుర్తుచేశారు. రెండు నెలల్లో తిరిగి తీసుకువస్తామని ఇచ్చిన హామీ 32 ఏండ్లు గడిచినా అమలు కాలేదని అన్నారు. అప్పుడు తాను ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను తోసిపుచ్చిన అబ్దుల్లా.. జడ్జి చేత విచారణ లేదా కమిటీవేస్తే వాస్తవాలు బయటపడుతాయన్నారు.
వాస్తవాల ఆధారంగా తీయలేదు: బృందాకారత్
వాస్తవాల ఆధారంగా కశ్మీర్ ఫైల్స్ చిత్రీకరణ జరుగలేదని సీపీఎం నేత బృందాకారత్ అన్నారు. వలసల సమయంలో కశ్మీరీ పండిట్లతో పాటు ఇతర వర్గాలకు చెందిన వారూ ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ఐఏఎస్ అధికారి నియాజ్ను బర్తరఫ్ చేయండి
‘కశ్మీర్ ఫైల్స్’ తీసిన డైరెక్టర్, నిర్మాతలు దేశంలో ముస్లిములు హత్యలపైనా సినిమా తీయాలని మధ్యప్రదేశ్కి చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ఖాన్ కోరారు. సినిమా ద్వారా వచ్చిన రూ.150 కోట్ల ఆదాయాన్ని పండిట్ల పిల్లల విద్యకు, కశ్మీర్లో వారి కోసం ఇండ్ల నిర్మాణానికి ఇవ్వాలని ఇటీవల ట్వీట్లు చేశారు. దీనికి స్పందించిన డైరెక్టర్ అగ్నిహోత్రి.. 25న భోపాల్లో కలుద్దామన్నారు. కాగా, నియాజ్ఖాన్ను పదవి నుంచి తొలగించాలని మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ డిమాండ్ చేశారు.