ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మధ్య కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఆదివారం ఓ విలాసవంతమైన హోటల్ నుంచి విధాన్ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కల్పించిన భారీ భద్రత ఏర్పాట్లపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వమే లక్ష్యంగా ఆదిత్య ఠాక్రే తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ముంబైలో ఇంతకు ముందు ఇలాంటి భద్రతను చూడలేదు.
ఎందుకు భయపడుతున్నావు? ఎవరైనా పారిపోతారా? ఎందుకు అంత భయం’ అని షిండే గ్రూప్ ఎమ్మెల్యే ప్రత్యేక బస్సుల్లో విధాన్ భవన్కు చేరుకుతున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులు శివసేన – బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో జూలై 4న బల పరీక్షను ఎదుర్కోనున్నది. ఇదిలా ఉండగా.. షిండేకు మద్దతిచ్చే రెబల్ శివసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం సాయంత్రం గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చారు.
ఫ్లోర్ టెస్ట్ వేదికగా ఉన్న విధాన్ భవన్ ఉన్న దక్షిణ ముంబైలోని విలాసవంతమైన హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. శివసేనకు చెందిన 39 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సహా షిండేకు మద్దతిచ్చే 50 మంది ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం గోవా నుంచి చార్టర్డ్ విమానంలో ముంబైకి తరలివచ్చారు. ఉదయం గోవాకు వెళ్లిన షిండే వారికి తోడుగా వెనుదిరిగారు. 288 మంది సభ్యులున్న సభలో షిండేకు 10 మంది చిన్న పార్టీలు, స్వతంత్రులు, 106 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది.