Karnataka | బెంగళూరు : కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కలవరం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో నలుగురు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, గుండె సమస్యలతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండు రావు పేర్కొన్నారు.
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో నిన్న ఆరోగ్య శాఖ సమావేశమై పలు అంశాలపై చర్చించిందని మంత్రి తెలిపారు. త్వరలోనే కరోనా నివారణకు సంబంధించిన విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు. కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని ఆదేశించామన్నారు. కేరళ సరిహద్దులో ఉన్న మంగళూరు, చామరాజనగర్, కొడగు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతామన్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి కరోనా కేసులు 1800లకు చేరుకున్నాయి. 4.46 కోట్ల మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కరోనా కారణంగా 5,33,317 మంది మరణించారు.