బెంగళూరు: అమ్మాయి పుట్టలేదన్న బాధతో ఓ మహిళ మగబిడ్డను బావిలో పడేసింది. దీంతో 11 రోజుల పసిబాబు చనిపోయాడు. కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుల్లియాలోని కూట్కుంజ గ్రామానికి చెందిన పార్వతీ అనే యువతికి నాలుగేళ్ల కిందట బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అతడి నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు ఏడాది కిందట తుమకూరులోని సిరాకు చెందిన మణికంఠతో రెండో పెళ్లి జరిగింది. అయితే అనారోగ్య కారణాలతో భర్తను వీడిన ఆమె పుట్టింటికి చేరింది.
కాగా, గర్భవతి అయిన పార్వతీ తనకు ఆడ పిల్ల పుట్టాలని ఆశపడింది. అయితే ఈ నెల 19న మంగళూరులోని మహిళా ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది. ఆడ పిల్ల పుట్టకపోవడంతో పార్వతి తీవ్ర నిరాశ చెందింది. పసి బాబుకు పాలు ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. తనకు మగ పిల్లవాడు వద్దని శనివారం తన వదినతో చెప్పింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చేతిలోని బాబుతో గది నుంచి బయటకు వచ్చింది. మగ బిడ్డ వద్దని వదినతో మరోసారి అన్నది. ఆ తర్వాత ఇంటి ముందున్న బావి వద్దకు వెళ్లి పసి బాబును అందులో పడేసి తన గదిలోకి వెళ్లిపోయింది.
మరోవైపు పార్వతీ చర్యకు షాక్ అయిన ఆమె వదిన వెంటనే తన భర్తకు, స్థానికులకు ఈ విషయం చెప్పింది. దీంతో వారు అతి కష్టం మీద బావి నుంచి బాబును బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ బిడ్డ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పార్వతీ వదినను ఆరా తీశారు. ఆమె స్టేట్మెంట్ మేరకు పార్వతీని అరెస్ట్ చేశారు. పసి బాబును హత్య చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.