బెంగళూరు: కర్ణాటకలో కరోనా రోజువారీ కేసులు 50 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 50,210 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,57,796కు పెరిగింది. పాజిటివిటీ రేటు 22.77 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 19 మంది కరోనాతో మరణించారు. 22,842 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు ఒక్క బెంగళూరులోనే కొత్తగా 26,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాజధాని నగరంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2.31 లక్షలకు చేరింది. కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. దీంతో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినం చేసింది.