బెంగళూరు, జనవరి 1: బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం చోటుచేసుకున్న అల్లర్లలో పాల్గొన్న నిందితుడిని 30 ఏండ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేత జరిగినప్పుడు కర్ణాటకలోని హుబ్బలిలో కూడా అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో పూజారి అనే వ్యక్తి అల్లర్లలో పాల్గొన్నాడు. అప్పుడు ఆయన వయసు 20 ఏండ్లు. ఈ కేసులో తాజాగా పూజారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇప్పుడు ఆయన వయసు 50 ఏండ్లు. దీనిపై హుబ్బలి పోలీసు కమిషనర్ రేణుక సుకుమార్ మాట్లాడుతూ ‘ఈ కేసు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నది. పెండింగ్ కేసులను క్లియర్ చేస్తున్న క్రమంలోనే తాజాగా పూజారిని అరెస్టు చేశాం’ అని తెలిపారు.