బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ పట్ల భారతీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ సాధించిన ఈ విజయాన్ని కొందరు తల్లిదండ్రులు మరింత స్ఫూర్తిగా తీసుకున్నారు. చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన పేర్లను పుట్టిన పిల్లలకు పెడుతున్నారు.
కర్ణాటకకు చెందిన బాలప్ప, నాగమ్మ దంపతులకు జూలై 28న బాబు పుట్టాడు. ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ఇస్రో మూన్ మిషన్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 24న తమ బాబుకు ‘విక్రమ్’ అని నామకరణం చేశారు. అలాగే అదే రాష్ట్రానికి చెందిన నింగప్ప, శివమ్మ దంపతులకు ఆగస్ట్ 14న ఆడబిడ్డ జన్మించింది. చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో ఆగస్ట్ 24న తమ బిడ్డకు రోవర్ పేరైన ‘ప్రజ్ఞాన్’గా నామకరణం చేశారు.
కాగా, ఆగస్ట్ 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ దిగింది. ఇస్రో సాధించిన ఈ విజయం అనంతరం కొన్ని నిమిషాల్లో ఒడిశాలోని కేంద్రపరా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ముగ్గురు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. అయితే చంద్రయాన్-3 విజయం తర్వాత తమకు పిల్లలు పుట్టడంపట్ల ఆ బిడ్డల పేరెంట్స్ ఆనందం రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తమ పిల్లలకు చంద్ర, లూనా, ప్రజ్ఞాన్ వంటి పేర్లు పెడతామని వారు వెల్లడించారు.