బెంగళూరు, జూన్ 5 : పదవిని చేపట్టిన మూడు రోజులకే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను కోరుకున్న మంత్రిత్వ శాఖను కేటాయించ లేదన్న అసంతృప్తితో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయన బెంగళూరు అభివృద్ధి శాఖను కోరగా, జల వనరుల శాఖను అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మంత్రి పదవికే రాజీనామా చేశా తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఆ శాఖను తనకు అప్పగిస్తానని శివకుమార్ రెండుసార్లు తనకు వాగ్దానం చేశారన్నారు.
తాను అడగకపోయినా డీకే తన ఇంటికి వచ్చి మరీ తనకు ఆ శాఖను కేటాయిస్తున్నట్టు తెలపగా, తాను సరేనని అన్నానని తెలిపారు. ఇప్పుడు సీఎం పిలిచి బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించినా అంగీకరించ బోనని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. మరోవైపు మునియప్ప కూడా తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఆయనకు ఆహార, ప్రజాపంపిణీ శాఖను కేటాయించారు. అయితే ఆయన సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖను కోరుకున్నారు.