తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సచ్ఛీలుడిగా నిరూపించుకొని, మళ్లీ మంత్రినవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ సంతోశ్ సూసైడ్ నోట్లో తన పేరు రావడం అంతా కుట్రే అని అన్నారు. నాపై ఆరోపణ మోపారు. వాటిని క్లియర్ చేసుకోవాలి కదా. నిర్దోషిగా బయటకు రావాలి కదా. ఒకవేళ మంత్రి పదవిలో కొనసాగితే.. నేను విచారణను ప్రభావితం చేశానన్న అపవాదు వస్తుందని. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. కానీ.. నేను నిర్దోషిగానే బయటికి వస్తా. మరోసారి మంత్రినవుతా.. అని ఈశ్వరప్ప పేర్కొన్నారు.
మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్లు, బెదిరింపులు తాళలేక రెండు రోజుల క్రితం సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడటంతో కర్ణాటకలో రాజకీయ కలకలం చెలరేగింది. సంతోష్ పాటిల్ తన మరణ వాంగ్మూలంలో మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రకటించారు.దీంతో ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. విపక్షాలు ఒత్తిడి పెంచడంతో మంత్రి ఈశ్వరప్పను రాజీనామా చేయాలని సీఎం బస్వరాజు బొమ్ము ఆదేశించారు.