బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేవరకు రాష్ట్రానికి కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు. కర్ణాటకకు నాలుగోసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యెడియూరప్ప.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ్టికి సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.
ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. వెంటనే ఆయన యెడ్డీ రాజీనామాకు ఆమోదం తెలుపుతూ.. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు కేర్ టేకర్ బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. కాగా, బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించి కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం బీజేపీ అధిష్ఠానం త్వరలోనే కర్ణాటకకు పరిశీలకులను పంపనున్నారని తెలిపారు.