బెంగళూరు, నవంబర్ 14: కర్ణాటకలో పాఠశాలలకు కాషాయ రంగు వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదానికి దారి తీసింది. ‘వివేక స్కీం’లో భాగంగా రాష్ట్రంలోని 8,100 తరగతి గదుల్లో ఈ రంగు వేయాలని నిర్ణయించింది. అయితే, కాషాయ రంగుపై కాంగ్రెస్ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందూత్వ ఎజెండాను విద్యార్థులపై రుద్దేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారని ప్రభుత్వంపై మండిపడ్డాయి. కానీ, వివేకానందుడు ఆ రంగు వస్ర్తాలనే ధరించారని, ఆ ఉద్దేశంతోనే కాషాయ రంగును వేయాలని నిర్ణయించినట్టు సీఎం బొమ్మై చెప్తున్నారు. జాతీయ జెండాలోనూ కాషాయ రంగు ఉన్నదని చెప్పారు. ఈ వివరణపైనా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మరి అలాంటప్పుడు జాతీయ జెండాలోని మూడు రంగులను ఎందుకు వాడలేదని నిలదీశాయి. కాగా, ఇటీవల పుస్తకాల్లోంచి భగత్సింగ్, టిప్పు సుల్తాన్, లింగాయత్ సంఘసంస్కర్త బసవన్న, పెరియార్, నారాయణ గురుకు సంబంధించిన అంశాలను ఆ రాష్ట్ర సర్కారు తొలగించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో విద్యావ్యవస్థ కాషాయీకరణ చేస్తున్నారంటూ పలువురు విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.