బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఎప్పుడైనా కూలొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి ఒకరు కేసులతో సతమతం అవుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయన దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ మేరకు ఆ మంత్రి బీజేపీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
ఆదివారం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ‘కర్ణాటక కాంగ్రెస్లో అంతా సవ్యంగా లేదు. ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. కేసుల నుంచి బయటపడేందుకు కీలక మంత్రి సతమతం అవుతున్నాడు. ఆయన తప్పించుకునేందుకు వీలు లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనపై ఉచ్చు బిగించాయి’ అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో జరిగినట్లుగానే కర్ణాటకలో కూడా ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చునని చెప్పారు. రాజకీయ నేతలు తమ సౌకర్యం కోసం పార్టీలు మారుతారని, సిద్ధాంతాలను పక్కన పెడతారని అన్నారు.