బెంగళూరు : మూడు అడుగుల వరుడు.. రెండు అడుగుల వధువు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా.. సాంప్రదాయబద్ధంగా.. వీరి వివాహం ఘనంగా జరిగింది. కర్ణాటకలో జరిగిన ఈ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. చిక్కబళ్లపూర్ జిల్లా చింతామణి తాలుకాలోని కైవర యోగి నారాయణ ఆలయంలో విష్ణు, జ్యోతి వివాహం జరిగింది. వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం వైభవంగా జరిగింది.
బెంగళూరుకు చెందిన విష్ణు, కోలార్కు చెందిన జ్యోతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరిద్దరూ బెంగళూరులో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరికి గత కొంతకాలం నుంచి వారి కుటుంబాలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ వీరూ మరగుజ్జులు కావడంతో అందరూ తిరస్కరించారు. విష్ణు కుటుంబానికి జ్యోతి గురించి తెలిసింది. జ్యోతిని పెళ్లి చేసుకునేందుకు విష్ణు సిద్ధమయ్యాడు. అలా ఈ దంపతులు పెళ్లి పీటలెక్కారు. విష్ణు, జ్యోతి వివాహ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ యువ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.