Karnataka : చిన్న పిల్లలు, యువత సోషల్ మీడియాను వాడటం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇది వారిపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే పిల్లలు, టీనేజ్ యువత సోషల్ మీడియా వాడకంపై పరిమితులు, నిషేధం విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకంపై నిషేధం, ఆంక్షలు విధించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ యూనివర్సిటీల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ వాడకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంపస్ పరిసరాల్లో వీటి వాడకాన్ని నిషేధించడం లేదా ఆంక్షలు విధించడం చేయాలనుకుంటోంది. ఈ మేరకు దీన్ని అమలు చేసే అంశంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను సంప్రదిస్తోంది. వారి నుంచి వచ్చే సూచనల్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు, యువత సోషల్ మీడియా ఎక్కువగా వాడుతూ చెడు ప్రభావానికి గురవుతున్నారన్నారు. వారి ప్రవర్తనలో మార్పులు, మానసిక ఇబ్బందులు, చదువులో వెనుకబడిపోవడం వంటివి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అలాగే ఈ ప్రభావంతో డ్రగ్స్కు, సోషల్ మీడియాకు కూడా బానిసలవుతున్నారని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా విద్యార్థులపై ఆంక్షలు విధించే అంశంలో అభిప్రాయాలు చెప్పాలని వీసీలను సీఎం కోరారు. విద్యా సంబంధ అంశాల్లో మొబైల్ వాడకంపై మినహాయింపు ఇస్తూనే, ఆంక్షలు విధించే అంశంపై సూచనల్ని అడిగారు. ఇదే తరహా ప్రతిపాదన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా చేసింది. సోషల్ మీడియా వాడకంపై వయసు ఆధారంగా పిల్లలకు పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.