బెంగళూర్ : దేశవ్యాప్తంగా రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు. ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరుతూ కర్నాటక గవర్నర్ వాజూభాయ్ వాలాకు రాజ్ భవన్ లో శనివారం డీకే శివకుమార్ మెమొరాండం సమర్పించారు. కొవిడ్-19 వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని ఎదుర్కోవడంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్రపతిని ఉద్దేశించి ఇచ్చిన మెమొరాండంలో డీకే పేర్కొన్నారు.
మహమ్మారి విరుచుకుపడిన ఈ సమయంలో వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రజలకు రక్షణగా నిలుస్తుందని అన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ వ్యూహం లోపభూయిష్టంగా ఉందని ఆయన ఆరోపించారు. ఒకే వ్యాక్సిన్ కు వేర్వేరు ధరలు నిర్ణయించారని ప్రస్తావించారు. రోజుకు కోటి వ్యాక్సిన్లు ఇవ్వడం, దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే ప్రజలను కాపాడుకోగలమని మెమొరాండంలో ఆయన పేర్కొన్నారు.