బెంగళూరు; కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ఆ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ అయ్యింది. డీకే శివకుమార్కు సంబంధం ఉన్న ఒక ‘కుంభకోణం’ గురించి లోక్సభ మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ ఎంకే సలీం అందులో మాట్లాడుకున్నారు. డీకే శివకుమార్తోపాటు ఆయన అనుచరుడు కోట్లలో లంచాలు తీసుకున్నట్లు ఆ వీడియోలో ఆరోపించారు. ‘ముందుగా ఆరు నుండి ఎనిమిది శాతం ఉండగా 10 నుంచి 12 శాతంగా మారింది. ఇదంతా డీకే సర్దుబాటు చేశారు. ముల్గుండ్ (డీకే అనుచరుడు) రూ.50-100 కోట్లు సంపాదించాడు. ముల్గుండ్ వద్ద ఇంత ఉంటే, డీకే వద్ద ఇంక ఎంత ఉంటుంది’ అని సలీమ్ అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడైన డీకే శివకుమార్ వల్ల పార్టీ ఎలాంటి ఉపయోగం లేదని వీఎస్ ఉగ్రప్ప, సలీం చర్చించుకున్నారు. ‘డీకేను పార్టీ అధ్యక్షుడ్ని చేయడానికి మనమంతా తీవ్రంగా పోరాడాం. కానీ ఆయన మనల్ని, పార్టీని బాధపెట్టాడు’ అని ఉగ్రప్ప ఆ వీడియో క్లిప్లో అన్నారు. శివకుమార్ ఎప్పుడూ తాగి ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు తడబడతారా అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యతో తనను పోల్చుకుంటారని విమర్శించారు.
‘మాట్లాడుతున్నప్పుడు అతను (డీకే) తడబడతాడు. తక్కువ బీపీ వల్లనా లేక మద్యం సేవించి ఉండటంతోనా అన్నది నాకు తెలియదు. మేము చర్చించుకున్నది అదే. ఆయన తాగి ఉన్నారా అని మీడియా కూడా అడిగింది. కానీ అది కాదు. సిద్ధరామయ్య బాడీ లాంగ్వేజ్ కడక్ (చాలా స్మార్ట్)’ అని సలీమ్ అన్నారు.
కాగా, ఈ వీడియో లీక్ కావడంతో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ ఎంకే సలీంను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడారు. డీకే శివకుమార్పై బీజేపీ చేసిన వ్యాఖ్యలపైనే తాము చర్చించుకున్నామని, ఆయనపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. దీని గురించి మాట్లాడ వద్దని సలీమ్కు తాను చెప్పినా ఆయన కొనసాగించారని చెప్పారు.
డీకేపై అవినీతి ఆరోపణలను ఉగ్రప్ప ఖండించారు. ప్రజల కోసం ఆయన పని చేస్తున్నారని అన్నారు. ‘కమీషన్ లేదా అవినీతికి కాంగ్రెస్ దూరంగా ఉంది. అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.