బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కనకపుర నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన డీకే.. ఎన్నికల అఫిడవిట్లో తనకు ఆస్తుల విలువ రూ.1,214 కోట్లుగా పేర్కొన్నారు. దాంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీపడుతున్న అభ్యర్థులందరిలో ఆయనే టాప్ ప్లేస్లో నిలిచారు.
కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సమర్పించిన అఫిడవిట్లో డీకే తన ఆస్తుల విలువను రూ.721.56 కోట్లుగా పేర్కొన్నారు. అంటే అప్పటికీ, ఇప్పటికీ ఆయన ఆస్తుల విలువ 68 శాతం పెరిగింది. ఇక తాజా అఫిడవిట్లో తెలిపిన రూ.1,214 కోట్ల ఆస్తుల్లో.. స్థిరాస్తుల విలువ రూ.970.01 కోట్లుగా డీకే వెల్లడించారు. చరాస్తులు రూ.244.93 కోట్లుగా తెలిపారు.
అదేవిధంగా తనకు ఉన్న అప్పుల వివరాలను కూడా డీకే ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. లోన్లు, ఇతర రుణాలు కలిపి ఆయనకు మొత్తం రూ.244.93 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మరో రూ.227.20 కోట్ల వివాదాస్పద రుణాలు కూడా ఉన్నట్లు డీకే పేర్కొన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 10న జరగనుంది. వచ్చే నెల 13న ఫలితాలను వెల్లడించనున్నారు.