పనాజీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొద్ది సేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లిన జేపీ నడ్డా.. ఇవాళ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం యడియూరప్పను మెచ్చుకున్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప పనితీరు చాలా బాగుందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. యడియూరప్ప స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నారటగదా అన్న మీడియా ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వ సమస్య లేదని, అది మీ మీడియా ఫీలింగ్ మాత్రమేనని, మాకు మాత్రం అలాంటి ఫీలింగ్ లేదని ఆయన మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సాయంత్రానికి హైకమాండ్ ఆదేశాలు వస్తే అందుకు తగినట్టుగా తన నిర్ణయం ఉంటుందని కొన్ని గంటల క్రితం యడియూరప్ప వ్యాఖ్యానించిన నేపథ్యంలో జేపీ నడ్డా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.