Karnataka | కర్నాటకలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి సర్కార్ అప్రమత్తమైంది. కోవిడ్ నియమాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సీఎస్ను ఆదేశించారు. ఉల్లంఘనులు ఎవరైనా సరే… బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయినా సరే, వారిపై కేసులు నమోదు చేయాల్సిందేనని సీఎస్కు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. బీజేపీకి చెందిన వారే కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారని పాత్రికేయులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ వారైనా సరే… ఉల్లంఘించే వారిపై చర్యలకు మాత్రం ఏ మాత్రం ఉపేక్షించవద్దు అని సీఎం బొమ్మై పేర్కొన్నారు.
కాంగ్రెస్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని తామే స్వయంగా నిర్ణయించామని బొమ్మై స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎస్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సీఎం బొమ్మై పై విధంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం బొమ్మై సాంకేతిక సలహాల బృందంతో కోవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు. కోవిడ్ నియమ నిబంధనల సడలింపు, సరళతరం చేయడం లాంటి అంశాలను సాంకేతిక బృందంతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.