బెంగళూరు: కేరళ సీఎం పినరయి విజయన్కు మొండిచేయి ఎదురైంది. ఆయన ప్రతిపాదించిన మూడు రైలు ప్రాజెక్టులను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తిరస్కరించారు. ఒక మార్గంలో బస్సుల సంఖ్యను కూడా పెంచేందుకు ఆయన నిరాకరించారు. దీంతో గంపెడు ఆశతో కర్ణాటక సీఎం బొమ్మైను స్వయంగా కలిసిన కేరళ సీఎం పినరయి విజయన్కు నిరాశ ఎదురైంది. బెంగళూరులోని సీఎం బొమ్మై నివాస కార్యాలయంలో వారిద్దరూ ఆదివారం సమావేశమయ్యారు. దక్షిణ ప్రాంత కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కన్హంగాడ్-కానియూర్ రైలు మార్గం, ఇతర హైవే ప్రాజెక్టులతో సహా వివిధ రైల్వే ప్రాజెక్టుల్లో కర్ణాటక సహకారాన్ని కేరళ సీఎం విజయన్ కోరారు.
కాగా, ప్రతిపాదిత కన్హంగాడ్-కానియూర్ రైలు మార్గం ప్రాజెక్టు కేరళలో 40 కిలోమీటర్లు, కర్ణాటకలో 31 కిలోమీటర్లు ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కర్ణాటకకు పెద్దగా ప్రయోజనకరం కాదని కర్ణాటక సీఎం బొమ్మై స్పష్టం చేశారు. పశ్చిమ కనుమలలోని సుసంపన్నమైన జీవవైవిధ్యం, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల గుండా ఈ మార్గం ఉందంటూ ఈ ప్రాజెక్టును తిరస్కరించారు.
మరోవైపు కేరళ సీఎం విజయన్ ప్రతిపాదించిన తెలిచేరి-మైసూర్ రైల్వే లైన్ పాత ప్రాజెక్టుకు కూడా కర్ణాటక సీఎం బొమ్మై నో చెప్పారు. ప్రతిపాదిత రైలు మార్గం బందీపూర్, నాగర్హోళే జాతీయ ఉద్యానవనాల గుండా వెళ్లే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. భూగర్భ రైలు మార్గం ప్రాజెక్టును కేరళ సీఎం ప్రతిపాదించగా పర్యావరణానికి హాని కలుగుతుందంటూ సీఎం బొమ్మై తిరస్కరించారు.
బందీపూర్ జాతీయ రహదారి గుండా రాత్రిపూట ప్రస్తుతం రెండు బస్సు సర్వీసులు ఉండగా ఈ సంఖ్యను నాలుగుకు పెంచాలన్న కేరళ సీఎం విన్నపాన్ని కూడా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నిరాకరించారు. సీఎం విజయన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని మీడియాకు ఆయన వెల్లడించారు.