PSI Scam in Karnataka | కర్ణాటకలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (పీఎస్ఐ) నియామక పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థుల నుంచి రూ.25 లక్షల చొప్పున ముడుపులు తీసుకుని, వారి ఆన్సర్షీట్లను ఒక స్కూల్ టీచర్లు భర్తీ చేసిన బాగోతాన్ని కర్ణాటక సీఐడీ అధికారులు నిగ్గు తేల్చారు. ఇందులో అధికార బీజేపీ నేత- స్కూల్ ఓనర్ దివ్య హగరాగి ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. ఆన్సర్ షీట్లు తారుమారుచేసిన సిబ్బందికి రూ.4000 చెల్లించి సరిపెట్టేశారు.
ఈ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్కామ్పై దర్యాప్తు జరిపిన సీఐడీ.. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కలబుర్గి మేజిస్ట్రేట్ కోర్టులో 1900 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. దీని ప్రకారం సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్, ఇతర సిబ్బంది.. ఎస్ఐ పోస్టుకు నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థుల తరఫున ఆన్సర్షీట్ పూరించేశారని సీఐడీ ఆరోపించింది.
గతేడాది అక్టోబర్ మూడో తేదీన కర్ణాటకలోని 545 పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు పరీక్ష జరిగితే, దాదాపు 54,041 మంది హాజరయ్యారు. గమ్మత్తేమిటంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు డీజీపీ అమృత్ పాల్ కూడా ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మంజునాథ్ మెల్కుందు అనే రాష్ట్ర నీటిపారుదలశాఖ అసిస్టెంట్ ఇంజినీర్తో కలిసి హగరాగి ఈ కుంభకోణానికి తెర తీశారని సీఐడీ తన చార్జిషీట్లో పేర్కొంది. మెల్కుందు ప్రతిపాదనను ఆమోదించిన హగరాగి.. తమ స్కూల్ హెడ్మాస్టర్ కాశీనాథ్తో కలిసి మొత్తం బాగోతం పూర్తి చేశారు. అందుకు హగరాగి సొంత స్కూల్ సిబ్బంది సావిత్రి కబా, సుమ, సిద్దమ్మ బిరాదారా, అర్చనా గోనాగెరి, సుననందలకు రూ.4000 చెల్లించారు. అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన సంగతి టీచర్లకు తెలియదని, తమకు రూ.4000 రావడంతోనే సంతృప్తి చెందారని సీఐడీ తన చార్జిషీట్లో తెలిపింది.
దీనిపై కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికవ్వడానికి 300 మంది అభ్యర్థులు ఎజెంట్ల ద్వారా డబ్బు చెల్లించారని ఆరోపించారు. బీజేపీ నాయకులు అశ్వథ్ నారాయణ్, ఆర్ అశోక్, బస్వరాజు బొమ్మై, యెడియూరప్ప తనయుడు (విజయేంద్ర) యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు.
జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి స్పందిస్తూ ఈ కుంభకోణంతో మాజీ సీఎం కొడుకు పాత్ర ఉందని ఆరోపించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ రియాక్టయ్యారు. సదరు మాజీ సీఎం కొడుకు పేరు బయటపెట్టాలని కుమారస్వామిని కోరారు. సిద్దరామయ్య కొడుకు కూడా ఈ కుంభకోణంలో ఉన్నాడని ఆరోపించారు.