బెంగళూరు: బీఎస్ యెడియూరప్ప వారసుడిగా.. కర్ణాటక తదుపరి సీఎంగా బస్వరాజ్ ఎస్ బొమ్మై ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో సీఎం ప్రమాణ స్వీకారం జరుగనున్నది. ఈ సంగతిని బీజేపీ కేంద్ర పరిశీలకులు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం వెల్లడించారు.
సోమవారం రాష్ట్ర సీఎంగా యెడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలకులుగా హాజరైన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో బీఆర్ బొమ్మైని తమ నేతగా ఎన్నుకున్నారు.
బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక తర్వాత బొమ్మై ప్రమాణ స్వీకారం వివరాలను మీడియాకు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కర్ణాటక సీఎంగా ఎంపికైన బస్వరాజు ఎస్ బొమ్మైని సీఎం బీఎస్ యెడియూరప్ప తొలుత అభినందించారు.
కర్ణాటకను అభివ్రుద్ధి పథంలో నడిపేందుకు మీరు సారధ్యం వహిస్తారని నేను విశ్వాసంతో ఉన్నా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని విశ్వాసంతో ఉన్నా.. అని ట్వీట్ చేశారు. బీఎస్ యెడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా బస్వరాజు ఎస్ బొమ్మై పేరొందారు.