Kapil Sibal | లోక్సభ ఎన్నికలకు ముందు అన్యూహ పరిణామం చోటు చేసుకున్నది. త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుండగా కేంద్ర ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయ పార్టీలను షాక్కు గురి చేశాయి. అరుణ్ గోయల్ రాజీనామాపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. ఈ నిర్ణయం ఆశ్చర్యకరమన్నారు. ఎన్నికలకు ముందు రాజీనామా చేస్తే.. ఏదో తీవ్రమైన విషయం ఉందని.. ఆ కారణాలను ఊహించలేకపోయానన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
గతంలో మాదిరిగానే మళ్లీ సొంత వ్యక్తులతో వారు (బీజేపీ) ఎన్నికల కమిషన్ను నింపుతారని ఆరోపించారు. అధికార పార్టీ అభిరుచికి తగ్గట్టుగా ఎన్నికల కార్యక్రమాన్ని రూపొందిస్తారని.. గతంలో కూడా బీజేపీ వారు ‘ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ప్రతిపక్ష సభ్యుడు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే.. అతనికి వెంటనే నోటీసు ఇస్తారు. ఈ కమిషన్ ప్రవర్తన మాకు తెలుసు. కాబట్టి తమకు వారిపై ఎలాంటి అంచనాలు లేవు’ అన్నారు.
ఇదిలా ఉండగా.. అరుణ్ గోయల్ శనివారం ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు ఆయన రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు గోయల్ తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం రాజీనామాను వెనక్కి తీసుకునేలా చర్చలు జరిపినా అంగీకరించలేదని తెలుస్తున్నది. ఆరోగ్య కారణాలతో ఆయన ఈ నెలలో బెంగాల్ పర్యటన నుంచి మధ్యలోనే వెనుదిరిగారు. మార్చి 8న ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపుకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శితో జరిగిన భేటీకి హాజరయ్యారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.