Union Minister Giriraj singh | పాట్నా, జూన్ 10: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ఈ దేశ సుపుత్రుడంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతిపితను పొట్టనబెట్టుకున్న గాడ్సే ‘భరతమాత సుపుత్రుడు’ అయితే మరి వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, చంబల్ లోయ బందిపోట్లు కూడా ఈ దేశ సుపుత్రులేనా? అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ రెండురోజుల క్రితం ఛత్తీస్గఢ్ పర్యటన సందర్భంగా దంతెవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఒకవేళ నాథూరామ్ గాడ్సే కనుక గాంధీ హంతకుడే అయి ఉంటే అతడు భరతమాత సుపుత్రుడే. ఈ దేశంపై దురాక్రమణకు పాల్పడిన ఔరంగజేబ్, బాబర్లా కాకుండా గాడ్సే భారతదేశంలో జన్మించాడు’ అని వ్యాఖ్యానించారు. సుబుద్ధి కలిగిన వాడిని సుపుత్రుడు అంటారని, అహింసావాది అయిన గాంధీని చంపిన గాడ్సే సుపుత్రుడెలా అవుతాడని జనతాదళ్ (యూ) అధికార ప్రతినిధి నీరజ్కుమార్ ప్రశ్నించారు.
గాడ్సే సుపుత్రుడైతే.. గంధపు చెక్కల దొంగ వీరప్పన్, ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, చంబల్లోయ బందిపోట్లను కూడా సుపుత్రులేనని పిలవాలా? అని నీరజ్కుమార్ ప్రశ్నించారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను రాజ్యసభ ఎంపీ కపిల్సిబల్ కూడా తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులకు సహకరించిన బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ ఎన్నడూ మహాత్ముడు చేసిన సేవలను గుర్తించలేదని అన్నారు. ‘గిరిరాజ్ సింగ్ చెప్పినట్టు గాడ్సే ఈ దేశ సుపుత్రుడే కాబట్టి.. స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్ బ్రిటిష్ వారికి సహాయం చేసింది. అందువల్ల గాంధీజీ చేసిన సేవలను వారు ఎలా గుర్తించగలరు? వారి సిద్ధాంతాలు, నమ్మకాలన్నీ గాంధీజీ ప్రవచించిన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ కూడా ఖండించారు. జాతిపితను చంపిన వ్యక్తిని కీర్తించడం అత్యంత హేయమని విమర్శించారు.