న్యూఢిల్లీ: తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం సుపారీ కూ డా ఇచ్చారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందించారు. ఆ సుపారీ ఇచ్చిన వారి పేర్లు చెప్పాలని, తద్వారా వారిని విచారించొచ్చని మోదీని కోరారు. ‘వ్యక్తులు, సంస్థలు, దేశాలు.. వీరిలో ఎవరున్నా, ఆ సుపారీ ఇచ్చిన వారి పేర్లు దయచేసి చెప్పండి. ఇది దేశ రహస్యం కాకూడదు. వారిని విచారిద్దాం’ అని ఆదివారం తన ట్విట్టర్ పోస్టు ద్వారా ప్రధానిని అభ్యర్థించారు. శనివారం భోపాల్లో వందేభారత్ రైలును ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ 2014 నుంచి తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకోసం వారు సుపారీ కూడా ఇచ్చారని, కొంతమంది దేశం లోపల నుంచి, మరికొంతమంది దేశం బయట నుంచి వీరికి మద్దతుగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.