న్యూఢిల్లీ : యూపీలో పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ అతీఖ్ అహ్మద్, ఆష్రఫ్ల హత్యపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) 8 ప్రశ్నలను లేవనెత్తారు. శనివారం రాత్రి మెడికల్ చెకప్ కోసం వీరిని తీసుకువెళుతుండగా మీడియా సమక్షంలోనే దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఆర్ట్ ఆఫ్ ఎలిమినేషన్ పేరుతో కపిల్ సిబల్ ట్వీట్ చేస్తూ ఈ ఉదంతంపై ప్రశ్నలు లేవనెత్తారు.
రాత్రి పదిగంటలకు మెడికల్ చెకప్కు ఎందుకు తీసుకువెళ్లారు, మెడికల్ ఎమర్జెన్సీ లేకున్నా బయటకు తీసుకురావడం, బాధితులను నడిపించడం, మీడియాను అనుమతించడం, నిందితుల చేతుల్లో ఖరీదైన దిగుమతి చేసుకున్న ఆయుధాలు ఉండటం, హంతకులు కాల్పుల్లో సుశిక్షుతులు కావడం, ముగ్గురు హంతకులు లొంగిపోవడం వంటి సందేహాలను సిబల్ తన ట్వీట్లో ముందుకుతెచ్చారు. విపక్షాలు లేవనెత్తిన సందేహాలనూ సిబల్ తన ప్రశ్నల్లో ప్రస్తావించారు.
అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు ఆష్రఫ్ల హత్యను ప్రతిపక్ష నేతలు తప్పుపడుతూ బీజేపీ నేతృత్వంలోని యూపీ సర్కార్ శాంతిభద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. యూపీలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నేరస్తుల ఆత్మస్థైర్యం ఇనుమడించిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అతీఖ్, ఆఫ్రష్ హత్యలు యోగి సర్కార్ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు నిదర్శనమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
Read More