ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది.ఓ వర్గం గాంధీ కుటుంబాన్ని వెనకేస్తుండగా, మరో వర్గం.. జీ 23 వర్గం మాత్రం నిప్పులు చెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే సీనియర్ నేత, జీ 23 సభ్యుడు ఆజాద్ ఇంట్లో అసమ్మతి నేతలందరూ సమావేశమయ్యారు. కొత్త వారికి బాధ్యతలు అప్పజెప్పాలని, కొత్త తరం రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, జీ 23 సభ్యుడు కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబీకులు వెంటనే తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని సూటిగా డిమాండ్ చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛందంగానే వారు తమ పదవుల నుంచి దూరం జరగాలని సిబాల్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే అందరి పార్టీ అని, ఓ ఇంటి పార్టీ మాత్రం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధేయ కుటుంబం లేకుండా పార్టీ మనుగడే కష్టమని కొందరు అంటున్నారని, కాంగ్రెస్ అందరి పార్టీ అని, ఒక కుటుంబ పార్టీ కాదని కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విరుచుకుపడ్డ అధిష్ఠానం విధేయులు
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలపై గాంధీ కుటుంబానికి విధుయులైన నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గాంధీ కుటుంబానికి విధేయంగా ఉంటున్న వారు కపిల్ సిబాల్పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలు మాట్లాడినట్టుగా సిబాల్ వ్యాఖ్యలున్నాయని రాహుల్ సన్నిహితుడు, ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్రంగా మండిపడ్డారు. నెహ్రూ గాంధీ కుటుంబాలపై బీజేపీ, ఆరెస్సెస్ ముందు నుంచీ విమర్శలు చేస్తున్నాయని, వారు లేకుంటే.. కాంగ్రెస్ అందరి పార్టీ అవుతుంది కాబట్టే వారిపై విమర్శలు చేస్తున్నారని, ఈ విషయం కపిల్ సిబాల్కు తెలుసని, అయినా వారి బుట్టలో పడిపోతున్నారని మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు.