న్యూఢిల్లీ: శివ భక్తులు శ్రావణ మాసంలో చేసే కన్వర్ యాత్ర (Kanwar Yatra) గురువారం ప్రారంభమైంది. కన్వర్ యాత్రికులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, బీహార్లోని సుల్తాన్గంజ్ తదితర ప్రాంతాలను దర్శించి అక్కడి పవిత్ర గంగాజలాలను సేకరిస్తారు. ఆ గంగాజలాలతో తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేస్తారు. అయితే యాత్రికులకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని కేంద్ర హోంశాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. యాత్రికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది.
కేంద్ర హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో రైర్వే బోర్డు భద్రతను పెంచింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది సంఖ్యను పెంచింది. ఏటా పదిహేను రోజుల పాటు శివభక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో చేపట్టే కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతేడాది కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.