న్యూఢిల్లీ : భారత్లో ఇటీవల వరుసగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇన్ఫెక్షన్ పెరుగుదల థర్డ్వేవ్కు సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో థర్డ్వేవ్లో రోజుకు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజుకు 30 నుంచి 60వేల వరకు, ఢిల్లీలో గరిష్ఠంగా 35వేల నుంచి 70వేల వరకు వస్తాయని ఐఐటీ కాన్పూర్ సీనియర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.
అధ్యయనం ఆధారంగా.. కేసులు పెరిగితే స్థానిక ఆసుపత్రుల్లో పడకల కొరత ఉండొచ్చన్నారు. పీక్ సమయంలో దేశంలో వైరస్ సోకిన వారితో పోలిస్తే ఒకటిన్నర లక్షల పడకలు అవసరం కావొచ్చన్నారు. ఇంతకు ముందు ఆయన పీక్ సమయంలో దేశంలో ప్రతిరోజూ రెండు లక్షల వరకు కేసులు వస్తాయని పేర్కొన్నారు. గతంలో దక్షిణాఫ్రికాలో వస్తున్న కేసుల ఆధారంగా భారత్లో ఇన్ఫెక్షన్ వేగాన్ని అంచనా వేశామని, అయితే ఇప్పుడు దేశంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు మోడల్లో గణాంకాలు మారిపోయాయని చెప్పారు.
దేశంలో సంక్రమణ వ్యాప్తి రేటు దక్షిణాఫ్రికా కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. జనవరి మూడో వారంలో ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయిలో రావొచ్చని, ఈ సమయంలో, ముంబై కంటే ఢిల్లీలో ఎక్కువ కేసులు గుర్తించొచ్చన్నారు.
భారత్తో సహా ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వేవ్ రాబోతుందని ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) డైరెక్టర్, వాషింగ్టన్ యూనివర్సిటీ హెల్త్ మెట్రిక్ సైన్సెస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ ముర్రే పేర్కొన్నారు. డెల్టా వేవ్లో కంటే ఈ సారి రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతాయని ఆయన అంచనా వేశారు. అయితే, ఒమిక్రాన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలవుతాయన్నారు. రోజుకు గరిష్ఠ 5లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. వచ్చే నెలలో గరిష్ఠ స్థాయిలో కేసులు రావొచ్చని అంచనా.
టీకాలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడ్డా తీవ్రమైన అనారోగ్యం, మరణం నుంచి గణనీయమైన రక్షణను అందిస్తుందని పేర్కొన్నారు. భారత్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉంటాయని, అయితే డెల్టాతో పోలిస్తే తక్కువ మంది ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉంటుందన్నారు. 85. 2 శాతం మందికి ఎలాంటి లక్షణాలుండవని, 90-95శాతం ఒమిక్రాన్ తీవ్రమైందని కాదని, అయితే, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా దేశంలో 22శాతం మంది యుక్త వయస్కులకు ఐదు రోజుల్లో టీకాలు వేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.